Ramleela: విజయ దశమి వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో శమీ పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు, గట్టుదుద్దెనపల్లి హనుమాన్ దేవాలయాల్లో పెద్ద సంఖ్యలో వాహన పూజలకు తరలివచ్చారు. గోదావరిఖనితో పాటు పలు చోట్ల పెద్ద ఎత్తున రామ్ లీలా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రామ్ లీలా కార్యక్రమాలకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కరీంనగర్ 7వ డివిజన్ లో ఘనంగా వేడుకలు
కరీంనగర్ లోని ఏడో డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కార్పొరేటర్ ఆకుల పద్మ ప్రకాష్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు డ్యాన్స్, పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. మహిళలకు ప్రత్యేకంగా డ్యాన్స్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రామ్ లీలా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాలనీ పెద్దలు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్