Avatar-3

Avatar-3 : అవతార్ సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Avatar-3
Avatar-3

Avatar-3 : ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అవతార్. ఇప్పటి వరకు రెండు భాగాలు రాగా, అవి సూపర్ హిట్ గా నిలిచాయి. మూడో భాగం టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించారు జేమ్స్ కామెరూన్. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అని పేరు పెట్టారు. దర్శకుడు- చిత్ర ప్రధాన తారాగణం D23 ఎక్స్‌పోలో పాల్గొని, సినిమా విడుదల తేదీ టైటిల్ ను అక్కడే ప్రకటించారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 19, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎక్స్‌పోలో ప్రకటించారు. టైటిల్, విడుదల తేదీ కూడా అవతార్ అధికారిక X (పూర్వ ట్విట్టర్) హ్యాండిల్ నుంచి వెల్లడైంది. కానీ మేకర్స్ మాత్రం ఇంకా అభిమానులకు ఈ సినిమా గురించి ఎలాంటి గ్లింప్స్ చూపించలేదు. అవతార్ యొక్క అధికారిక ఎక్స్ ఖాతాలో ఇలా ఇలా రాశారు.. “అవతార్ తదుపరి చిత్రం పేరు D23లో ప్రకటించబడింది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’.. పండోరకు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి. డిసెంబర్ 19, 2025న థియేటర్లలోకి రానుంది.

ఇప్పటి దాకా చూడనివి చూస్తారు..

జేమ్స్ కామెరూన్ ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు చూడనివన్నీ అవతార్ మూడవ భాగంలో ఉంటాయని హామీ ఇచ్చారు. “మీరు ఇంతకు ముందు చూసిన దానికంటే పండోరను ఈ చిత్రంలో మరింత ఎక్కువగా చూస్తారు” అని కామెరూన్ ప్రకటించారు. ఇది మీ కళ్లకు మరింత కొత్తదనాన్ని చూపించే క్రేజీ అడ్వెంచర్ అని అన్నారు. ఈ సారి సినిమాలో చాలా ఎమోషనల్ అంశాలు ఉంటాయని చెప్పారు. మీకు తెలిసిన, మీరు ఇష్టపడే పాత్రలను మరింత ఛాలెంజింగ్‌గా చేయబోతున్నామని వెల్లడించారు.

జేమ్స్ కామెరాన్ 2022 చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో అవతార్: ఫైర్ అండ్ యాష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రీకరించారు. ఈ సినిమాలో చాలా కొత్త క్యారెక్టర్లు కూడా ఎంటర్ కాబోతున్నాయి. “చాలా కొత్త పాత్రలు ఉంటాయి, ప్రత్యేకించి మీరు మరింత ప్రేమించే లేదా ద్వేషించే ఒక పాత్ర పాత్ర ఉంటుంది అని జేమ్స్ కామెరాన్ తెలిపారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు ఉనా చాప్లిన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఆష్ పీపుల్ నాయకుడైన వరంగ్ పాత్రలో కనిపించనున్నాడు. డేవిడ్ థెవ్లిస్ , మిచెల్ యోహ్ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఫ్రాంచైజీ అవతార్. అవతార్ మొదటి భాగం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. దీని తర్వాత రెండవ భాగం అవతార్ ది వే ఆఫ్ వాటర్ వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. 2009లో విడుదలైన అవతార్ బాక్సాఫీస్ వద్ద రూ.24 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. దీని తర్వాత 2022లో విడుదలైన అవతార్ 2 బాక్సాఫీస్ వద్ద రూ.19 వేల కోట్లకు పైగా కొల్లగొట్టింది.

అవతార్: ది వే ఆఫ్ వాటర్, అవతార్: ఫైర్ అండ్ యాష్ రిక్ జాఫా, అమండా సిల్వర్‌లతో కలిసి జేమ్స్ కామెరాన్ రాశారు. నిజానికి మొదట్లో ఇది ఒకే సినిమాగా అనుకున్నారు. కానీ సినిమా రాసేటప్పుడు మాత్రం సినిమాలో చాలా ఎక్కువ ఉందని భావించిన కామెరూన్ దానిని రెండు భాగాలుగా రూపొందించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *