Tholi Ekadashi

Tholi Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే దోష పరిహారం

Tholi Ekadashi: హిందూ ధర్మంలో ఒక్కో తిథికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే తొలి ఏకాదశి తిథికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది. ఒక్కో ఏకాదశిని ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.ఉపవాసం, వివిధ పూజా క్రతువులతో ప్రయోజనాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. ఈ క్రమంలో ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. మిగిలిన ప్రాంతాల్లో దేవ శయన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఏకాదశి రోజున పాల కడలిలో శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తారని భక్తుల విశ్వాసం. ఏకాదశి నుంచే హిందువుల పండుగుల ప్రారంభమవుతాయి. చాతుర్మాస్యవ్రతం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఏకాదశిన చాలా మంది అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండి శ్రీ మహా విష్ణువుని పూజిస్తుంటారు.

తొలి ఏకాదశి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. చాలా మంది పండరీపురం యాత్రకు వెళ్తుంటారు. వార్కరీలు పండరీనాథుని దర్శనానికి పండరీపురం యాత్రకు వెళ్తారు.

హిందువులు తొలి ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తుంటారు. నియమ నిష్టలతో పూజలు చేస్తుంటారు. ఏకాదశిన చేసే పూజ, ఉపవాసం, నియమం, వ్రతం ఇలా ఏదైనా సరే వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుందని భక్తుల నమ్మకం. వివాహాలు జాప్యం అవుతుంటే తొలి ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు చేస్తే శుభం కలుగుతుందని వేద పండితులు, పురోహితులు చెబుతున్నారు.

తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర నుంచి మేల్కొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అభ్యంగ స్నానాలు ఆచరించాలి. తర్వాత పూజగదిని శుభ్రం చేసి అందంగా రంగవల్లులతో తీర్చిదిద్దుకోవాలి. ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుని పూజించే సంప్రదాయం ఉన్నందున, ముందుగా ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, అరటి పండ్లు, పూజా సామగ్రిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. విష్ణువు మహా అలంకార ప్రియుడు. వివిధ రకాల పువ్వులతో పూజ చేసి, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి.

తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసే వారి కోరికలను స్వామివారు వెంటనే తీరుస్తారని భక్తుల నమ్మకం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరుగకపోతే తొలి ఏకాదశి రోజున యువతీయువకులు రుక్మిణి కల్యాణాన్ని 11 సార్లు పఠిస్తే శుభ ఫలితం ఉంటుందని..నెల తిరిగే సరికి వివాహం కుదురుతుందని భక్తుల నమ్మకం.

దంపతుల మధ్య గొడవలు ఉంటే తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వివాదాలు సద్దుమణిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అంతేకాదు సత్యానారాయణ స్వామి వ్రతం చేయడం వలన తెలిసీతెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకే తొలి ఏకాదశి రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటుంటారు.

ఇక ఏకాదశి ఉపవాసం రోజున చేసే పూజతో పాటు దానాలకు కూడా విశిష్ట ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఏకాదశిన పేదలకు, అవసరం ఉన్న వారికి అన్న వితరణ, వస్త్ర దానం వంటివి తోచిన సాయం చేయడం ద్వారా ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్షంతో జీవితంలో అన్నపానాదులకు లోటు ఉండదని వేది పండితులు చెబుతున్నారు.

తొలి ఏకాదశి రోజున నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే మంచిది. పూజ అనంతరం ఈ నెమలి ఈకను డబ్బులు భద్రపర్చుకునే లాకర్ లో పెడితే జీవితంలో ధనానికి ఎప్పటికీ లోటు ఉండదని విశ్వాసం.

జాతకంలో గ్రహ దోషాలతో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మూగ జీవాలకు ఆహారం అందించడం ద్వారా విశిష్ట ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. తొలి ఏకాదశి రోజున గోశాలలోని ఆవులకు మేత పెట్టడం శుభ ప్రదం. కుక్కలు, ఆవులు, మూగ జీవులకు ఆహరం అందించడం ద్వారా జాతకంలోని దోషాలు తొలగి, పెళ్లి ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయని, సంపదకు లోటు ఉండదని చెబుతుంటారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *