క్షేత్రస్థాయి కార్యక్రమాలపై నిత్య పర్యవేక్షణ
TPCC : ఏడాదిన్నర పాలనను విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా విమర్శిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ప్రభుత్వాధీనంలో ప్రజల మనసులు గెలుచుకునేలా పావులు కదుపుతూ, స్థానిక ఎన్నికల్లో పట్టు బిగించే ప్రయత్నంలో ఉంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తూ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగాన్ని పనిలోకి దింపింది. 18 నెలల పాలన తర్వాత పాలనపై పట్టు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చర్యలు చేపట్టారు.
జనవరిలో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకాధికారులతో పాలన కొనసాగిస్తూనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సర్కారు సమయం తీసుకుంది. హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించడంతో కాంగ్రెస్ beforehand అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించింది.
ఆరు గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసింది. లక్షకు పైగా ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. వర్షాకాలానికి ముందే బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉచిత ఇసుక సరఫరా, సీనరేజి చార్జీలను రద్దు చేసి లబ్ధిదారులకు సహాయం అందిస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం మంజూరు చేసిన 13 వేల ఇండ్లను పట్టణాల్లో మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత కోసం ప్రత్యేకాధికారులను నియమించి కొరత రాకుండా పర్యవేక్షిస్తోంది. లక్షా 25 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యంగా పనిచేస్తోంది. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. ఆగస్టు 15 లోగా ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.
పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవాలను విస్తృతంగా చేపట్టాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం కాంగ్రెస్ పార్టీనే వరిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.