యూనస్ వ్యాఖ్యలు మంటపెడుతున్నాయా?
Trade WAR: ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య వాణిజ్యంపై ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తున్నది. బంగ్లాదేశ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, భారత్ తాజా చర్యలతో వాణిజ్య రంగంలో స్పష్టమైన అసమ్మతి ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
2020లో బంగ్లాదేశ్కు అందించిన ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని భారత్ వెనక్కి తీసుకున్నది. అయితే దీనిపై స్పష్టతనిస్తూ, భారత ప్రభుత్వం ఈ చర్యను రవాణా కేంద్రాల్లో పెరిగిన రద్దీ తగ్గించేందుకు తీసుకున్నదని చెప్పింది. ఇది నేపాల్, భూటాన్ వంటి దేశాలకు బంగ్లాదేశ్ చేసే సరుకుల రవాణాపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
ఇక బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే, గత నెలలో భారతదేశంతో కూడిన మూడు భూ సరిహద్దు పోర్టులను మూసివేసింది. అంతేకాకుండా, భారత దిగుమతుల్లో భాగమైన నూలు సరఫరాపై నిషేధం విధించింది. జనవరిలో బెనాపోల్ కస్టమ్స్ వద్ద నిఘాను బలపరిచే చర్యలు కూడా చేపట్టింది. ఈ చర్యలు భారత వాణిజ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసినట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “భారతదేశం ఎప్పుడూ సానుకూల, నిర్మాణాత్మక చర్చలకే మద్దతు ఇస్తోంది. బంగ్లాదేశ్తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచాలని కోరుకుంటోంది,” అన్నారు.
అయితే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ, పాకిస్తాన్తో ప్రత్యక్ష వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పాకిస్తాన్ నుండి 50,000 టన్నుల బియ్యం కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ.. బ్యాంకాక్లో బంగ్లాదేశ్ సలహాదారు ముహమ్మద్ యూనస్ను కలిశారు. విమర్శలు వద్దని, ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి నష్టమని, సర్దుబాట్లు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు తాత్కాలికమేనా? లేక దీని ప్రభావం దీర్ఘకాలికమవుతుందా? అన్నది సమయం తేల్చనుంది.